హైదరాబాద్లో భారీ వర్షం

నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్‌లోని అనేక కాలనీలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నివాసాల్లోకి నీరు చేరటంతో వేలాది మంది తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నిన్న సాయంత్రం 3 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు జలాశయాలను తలపించాయి.

ఖైరతాబాద్‌లోని ప్రేమ్‌నగర్‌కాలనీ పూర్తిగా నీట మునిగింది. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు జలాశయాలను తలపించాయి. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, మీర్‌పేట, సికింద్రాబాద్‌, తార్నాక, ఉప్పల్‌, చంపాపేట, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట,మీర్‌పేట, ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటివరకూ 12 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.

లంగర్‌హౌస్‌, ప్రశాంత్‌నగర్, లక్ష్మీనగర్‌ ప్రాంతాల ప్రజలు ఇళ్లల్లోకి వరద నీరు చేరటంతో రాత్రి నుంచి ఇళ్ల పైకప్పుపైనే బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. అధికారులెవరకూ ఇప్పటివరకూ తమ ప్రాంతాలకు రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హైటెక్‌ సిటీ రైల్వే బ్రిడ్జి దగ్గర భారీ వరదతో ఓ కారు, రెండు బైకులు కొట్టుకుపోయాయి. రామంతాపూర్‌లోని శారదానగర్‌ రోడ్డుపై చెట్టుకూలిపోయింది. మలక్‌పేట రైల్వే బ్రిడ్జి క్రింద వరద నీరు భారీగా చేరటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పంజాగుట్ట మోడల్ హౌస్ వద్ద పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. దాంతో పారిశుద్య సిబ్బంది రంగంలోకి దిగారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను బంజారాహిల్స్ మీదగా పంజాగుట్ట వైపు మళ్లిస్తున్నారు.

posted in: News, News Update, State

Leave a Reply